Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శ్రీసిటీ, మే 30, 2024: ఏపీ ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 106B క్రింద నేరాల శిక్షల నిబంధనల సరళీకరణపై అభిప్రాయాలు, సూచనలను కోరుతూ రాష్ట్ర ఫ్యాక్టరీస్ డైరెక్టర్ డి.చంద్రశేఖర వర్మ శ్రీసిటీ పరిశ్రమలు మరియు ఈ ప్రాంతంలోని ఇతర పరిశ్రమల సీనియర్ హెచ్ ఆర్ మేనేజర్లతో గురువారం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటి చీఫ్ వి.రామకృష్ణా రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రతినిధులను ఉద్దేశించి వర్మ మాట్లాడుతూ, 2016లో ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టం, నిబంధనలలోని సెక్షన్ 106B కింద మొదటిసారిగా నేరాలను ప్రాసిక్యూషన్కు బదులు జరిమానా విధించే వెసలుబాటు కల్పించడం మరియు మరికొన్ని సవరణలు పరిశ్రమల భద్రతా వ్యవస్థలో పెను మార్పులు తెస్తాయని పేర్కొన్నారు. ఈ మార్పు దేశంలోని ఇతర రాష్ట్రాలలో అమలులో ఉందన్నారు. ఈ సవరణల వలన కలిగే ప్రయోజనాలు, లోపాలు, కార్మికుల భద్రత అంశాలపై అందరినీ చురుకైన చర్చలకు ఆహ్వానించారు. ఫ్యాక్టరీ భద్రతా పరమైన కొన్ని అతిక్రమణ నేరాలకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను సరళీకరించడం మరియు క్రమబద్ధీకరించడం ఈ సవరణల లక్ష్యం అని ఆయన అన్నారు. అటువంటి నేరాలను ప్రాసిక్యూషన్కు బదులుగా జరిమానా చెల్లించడం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రతిపాదిస్తున్న సవరణ అనుమతిస్తుంది. తద్వారా, ఇటు కార్మికులలు, యాజమాన్యాలకు, ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరుతుంది. ఫ్యాక్టరీ యజమానులు సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కోకుండా, తొలి సారిగా జరిగిన అతిక్రమణ పునరావృత్తం కాకుండా సరిదిద్దడానికి అధీకృత అధికారి సమ్మేళనం చేయవచ్చు. జరిమానాలు మరియు శిక్షా నిబంధనలు రెండవ లేదా తదుపరి నేరాలకు వర్తించవు. అయితే, కోడ్లో పేర్కొన్న షరతులలో కొన్ని నేరాలకు మాత్రమే ఈ క్రమబద్ధీకరణ సమ్మేళన ప్రక్రియ వర్తిస్తుంది. ఈ సంస్కరణల ద్వారా చట్టపరమైన వివాదాల సంఖ్యను తగ్గించడం, ఆర్థిక జరిమానాలు విధించడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వర్మ పేర్కొన్నారు. కొన్ని చిన్న చిన్న నేరాలను కోర్టు వెలుపల సులువుగా పరిష్కరించడానికి ఇది మార్గాన్నిసుగమం చేస్తాయని, అయితే పరిశ్రమల భద్రతా నిబంధనల ఉల్లంఘనకు ఏ మాత్రం ఆస్కారం ఉండదన్నారు. ప్రభుత్వ చురుకైన విధానాన్ని అభినందించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, కార్మిక చట్టాలను సరళీకృతం చేయడం, క్రమబద్ధీకరించడం లక్ష్యంగా ఈ సంస్కరణలు కొత్త అభివృద్ధి శకానికి దారితీస్తాయని తాను విశ్వసిస్తునన్నారు. ఈ సదస్సుకు దాదాపు 150 మంది హాజరయ్యారు.
Admin
Famous TV