Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : సదుం జూన్ 27 : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి న్యాయం చేయాలని జనసేన పార్టీ నాయకులు కోరారు.మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన మండల అధ్యక్షులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ సదుం ప్రాంత అభివృద్ధికి మంజూరైన ఒకటి రెండు కాంట్రాక్టు పనులను మధ్యలో నిలిపివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక అధికార యంత్రాంగం ఇప్పటికీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.జనసేన మండల ఉపాధ్యక్షులు జక్కల శ్రీకాంత్ మాట్లాడుతూ తమ గ్రామంలో తనకు కేటాయించిన కాంట్రాక్టు పనులను కూడా మధ్యలో నిలిపివేస్తున్నారని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పార్టీ కోసం కృషి చేసిన నాయకులు,కార్యకర్తలకు న్యాయం జరగాలని కోరారు.అదేవిధంగా, టీడీపీ మైనారిటీ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ తమకు చెందిన ఏడు ఎకరాల భూమిని ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ కు రెండుసార్లు ఫిర్యాదు చేశామని, మంత్రి నారా లోకేష్ బాబు ను కూడా కలిసి సమస్య పరిష్కారం కోరామని తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా అధికారుల స్పందన లేదని వాపోయారు.సదుం మండలంలో తమకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
Admin
Famous TV