Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ యస్వీయూ సెనేట్ హాల్లో నిర్వహించిన “ఆచార్య కె సర్వోత్తమరావు ధర్మనిధి ఉపన్యాసం” చేయడానికి , కరీంనగర్ జిల్లా ధర్మపురి నుండి డా॥ సంగనభట్ల నరసయ్య ముఖ్య ఉపన్యాసకులుగా వచ్చారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన యస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో 1954 నుండి తెలుగు విభాగం గొప్ప ఆచార్యలుతో విలసిల్లడం , వారు రాసిన పుస్తకాలు తెలుగు చదివే వారికి కర దీపికలు కావడం తనకు తెలుసునని అన్నారు. సంగనభట్ల వారు “ఆముక్తమాల్యద వైశిష్ట్యం” పై మాట్లాడుతూ ప్రపంచంలో శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తి లేరని, ఏ రాజు గొప్ప కవిగా రాణించలేదని అన్నారు.రాయలు అచ్చంగా తెలుగు వాడని, కన్నడీకుడు కాదని,వారు జీవిత కాలమంతా శోధించి, ప్రజాజీవితాన్ని,కవిత్వ సారాన్ని తన ఆముక్తమాల్యదలో ఇమిడ్చి ప్రౌఢ ప్రబంధంగా రాశారని అన్నారు. రాయలు ఆరు సంస్కృత గ్రంథాలు రాసిన విషయం చాలామందికివతెలియదని, వారి జాంబవతీ పరిణయం చదవమని చెప్పారు. రైతులు , వ్యాపారులు, ఆటవీప్రాంత వాసుల జీవితం ఆముక్తమాల్యదలో వుందని,దానిని లోతుగా చూడమన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన శాఖాధ్యక్షులు ఆచార్య రాజేశ్వరమ్మ ముఖ్యవక్త పాండిత్యాన్ని, పరిశోధనల తత్త్వాన్ని వివరించగా, ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి ధర్మనిధి ఉపన్యాసం నేపథ్యాన్ని వివరించారు. డా॥ ఆదిశేషయ్య అతిథులను వేదికపైకి ఆహ్వానించగా, డా॥ అశోక్ వందన సమర్పణ చేశాడు. తెలుగు శాఖ పూర్వ ఆచార్యులు, పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV