Famous TV - భక్తి / తిరుపతి : తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ మండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో జరిగిన వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగ న్యారాధన, రక్షా బంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. అనంతరం పవిత్ర మాలలు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకు వచ్చారు. ఉదమం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంను వైభవంగా చేశారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా ఉత్సవర్లను అభిషేకం చేశారు.సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు గ్రామంలో ఊరేగుతూ. భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘునాథ రెడ్డి, మంజుల దంపతులతో పాటు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
Admin
Famous TV