Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు నేపథ్యంలో తిరుమల క్షేత్రానికి భక్తులు క్యూ కట్టారు. సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను తీసుకోబోమని ప్రకటించింది. దీంతో పాటు కొన్ని సేవల్లో కూడా స్వల్ప మార్పులు చేసింది. ఆ వివరాలు..తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు రావడం, కోవిడ్ -19 ముప్పు పూర్తిగా తొలగిపోవడంతో.. కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు (Tirumala Darshan) తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై రద్దీ బాగా పెరిగింది. దీంతో సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఇక వారాంతాల్లో (శుక్ర, శని, ఆది వారాల్లో) ఈ సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని నియంత్రించేందుకు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు నిర్ణయాలు తీసుకుంది. జూన్ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. శనివారం (మే 20) ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు వారాంతాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని వెల్లడించారు.
Admin
Famous TV